కోటి మందితో యోగాంధ్ర-2026: సీఎం చంద్రబాబు ప్రకటన

  • జూన్ 21న కోటి మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' థీమ్‌తో యోగాంధ్ర-2026 కార్యక్రమం
  • పర్యాటక కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు
  • యోగాంధ్ర కోసం రూ.10 కోట్ల బడ్జెట్, ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
  • జూన్ నెలను 'యోగా నెల'గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది భాగస్వామ్యంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగాంధ్ర-2026’ పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్ 21న జరిగే ఈ కార్యక్రమ నిర్వహణ, లక్ష్యాలపై ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని, దానిని ప్రజా ఉద్యమంగా మార్చి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ ఏడాది 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' (వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించడం) థీమ్‌తో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు. "యోగా కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదు, ప్రతి వ్యక్తి నిత్య సాధనగా మార్చుకోవాలి. ఈ లక్ష్యంతో జూన్ నెలను 'యోగా నెల'గా ప్రకటిస్తున్నాం. జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయి" అని వివరించారు. 

ప్రధాన కార్యక్రమం అమరావతిలో కృష్ణానది పశ్చిమ బైపాస్ వంతెనపై 25 వేల మందితో నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో 2 వేల నుంచి 3 వేల మందితో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాలో పోలీసు సిబ్బంది, కోనసీమలో రైతులు వంటి ప్రత్యేక వర్గాలతో పాటు ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి 56 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించి ‘యోగా-టూరిజం’ను ప్రోత్సహిస్తామన్నారు.

యోగాంధ్ర-2026 విజయవంతం కోసం రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించామని, స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను, 2.50 లక్షల మంది ట్రైనర్లను తయారు చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సలహాలు, సేవలు తీసుకుంటున్నామని, ఆయన రూపొందించిన 168కి పైగా వీడియోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 81424 04888 వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపిస్తే యోగా వీడియోలు పొందవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా yogandhra.ap.gov.in పోర్టల్‌ను ప్రారంభించామని, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్ వంటి సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. గతేడాది యోగాంధ్ర కార్యక్రమానికి 2.44 కోట్ల మంది నమోదు చేసుకున్న స్ఫూర్తితో ఈసారి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసి, యోగాను 365 రోజుల ఉద్యమంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Yoga Andhra 2026
World Yoga Day
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News